నా తండ్రి ఆశయ సాధనే నా జీవిత లక్ష్యం.-రాధా

ఎం.గణేశ్, జర్నలిస్టు
ఘనంగా 79వ జయంతి వేడుకలు..
వాడవాడలా ప్రత్యక కార్యక్రమాలు
మారుతున్న కాలంలో రాజకీయ నాయకులను ప్రజలు త్వరగానే మర్చిపోతున్న ఈ రోజుల్లో, వంగవీటి మోహన రంగా మరణించి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఆయన పదిలంగా ఉండటం ఒక అరుదైన విషయం. పార్టీలకూ, కులాలకూ అతీతంగా ఆయనను అభిమానించే వారు ఇప్పటికీ ప్రతి ఊరిలోనూ కనిపిస్తారు. పేద ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యల కోసం పోరాడిన నాయకుడిగా ఆయన సంపాదించుకున్న ఆదరణే ఇందుకు కారణం. శనివారం ఆయన 79వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా, పార్టీ రహితంగా జరగడం ఆయనకున్న ప్రజాదరణకు నిదర్శనం. ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఒకే రోజు వేర్వేరు జిల్లాల్లో పర్యటించి విగ్రహావిష్కరణలు చేయడం విశేషం. విజయవాడ రాఘవయ్య పార్కు వద్ద ఉన్న రంగా విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

• ఎన్టీఆర్ జిల్లా: చందర్లపాడులో కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించారు.
• పశ్చిమ గోదావరి జిల్లా: పెనుమంట్రలో విగ్రహావిష్కరణ చేశారు.
• డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: పి.గన్నవరం, అలాగే రావులపాలెం మండలం పొడగట్లపల్లి (పడగట్య పల్లి) గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన రంగా గారి విగ్రహాలను ఆవిష్కరించారు.
భౌతికంగా దూరమైనా, పేదల కోసం ఆయన చేసిన పోరాటాలు, ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రజల్లో సజీవంగానే ఉన్నాయని ఈ వేడుకలు మరోసారి నిరూపించాయి.